Mahanaadu-Logo-PNG-Large

ఇకపై మారిన చంద్రబాబును చూస్తారు

బ్యూరోక్రాట్స్‌ పాలన ఎంతమాత్రం ఉండదు
తరచూ వచ్చి కలవండి..బిజీగా ఉన్నా కలుస్తా
కార్యకర్తలు, నేతల కృషివల్లే అధికారం సాధ్యమైంది
ఐదేళ్లు వారి ఇబ్బందులు మనోవేదన కలిగించాయి
ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా కలిసి పనిచేయాలి
ఈ నెల 12న ప్రమాణస్వీకారం చేస్తున్నా…
దిల్లీలో రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయాలి
ఎంపీలతో భేటీలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

అమరావతి : ఉండవల్లిలోని నివాసంలో ఎంపీలతో భేటీలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై మీరు మారిన చంద్రబాబును చూస్తారు. బ్యూరోక్రాట్స్‌ పాలన ఎంతమాత్రం ఉండదు. చంద్రబాబు మారరు అనే అపవాదు నాపై ఉంది. ఇకపై అలా ఉండదు.. మీరే ప్రత్యక్షంగా చూస్తారు. ఎంపీలందరూ తరచూ వచ్చి కలవండి. నేను బిజీగా ఉన్నా కూడా మాట్లాడతాను. నాకోసం ఈ ఐదేళ్లు నేతలు, కార్యకర్తలు ప్రాణాలిచ్చారు. కత్తి మీద పెట్టినా జై టీడీపీ, జై చంద్రబాబు అన్నారు. అధికార పార్టీ ఒత్తిడికి ఎవరూ తలొగ్గలేదు. ఇకపై ప్రతి అంశాన్ని నేను వింటాను.. నేనే చూస్తానని భరోసా ఇచ్చారు. ఇకపై రాజకీయ పరిపాలన ఉంటుందని, ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా ఎవరి పరిధిలో వారు కలిసి పనిచేయాలని సూచించారు. ఈ ఐదేళ్లు నేతలు, కార్యకర్తలు పడిన ఇబ్బందులు నాకు చాలా మనోవేదన కలిగించాయని, నేతలు, కార్యకర్తల కష్టం, త్యాగం, కృషి వల్లే ఇవాళ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేయాలని కోరారు. ఈనెల 12న తన ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలిపారు.